Reading Time: < 1 minute

కొత్తగూడెం,
మార్చి 7,2026

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా సీఎండీ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్ కొత్తగూడెం ఏరియాలో పర్యటించారు. ఆయనను కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతించారు. అధికారులు, కార్మిక సంఘాల నాయకులు కూడా ఆయనకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సీఎండీ వీకే కోల్ మైన్స్ ను సందర్శించి, అక్కడ మొదటిసారిగా ఉత్పత్తి అయిన బొగ్గును తరలించే లారీకి పచ్చ జెండా ఊపి రవాణాను ప్రారంభించారు. అనంతరం వికే సిఎం వ్యూ పాయింట్ నుంచి గని భౌగోళిక పరిస్థితులు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా చర్యలను పరిశీలించారు. గనుల్లో కార్మికుల పనితీరు, భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్షించి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

అనంతరం ఆయన పద్మావతి భూగర్భ గనిను సందర్శించి కంటిన్యూస్ మైనర్, ఎల్‌హెచ్‌డీ యంత్రాల పనితీరును పరిశీలించారు. అలాగే అండర్‌గ్రౌండ్ మైన్‌లోని మ్యాన్ రైడింగ్ సిస్టమ్, పంపింగ్ స్టేషన్, సబ్ స్టేషన్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు.

సింగరేణి అభివృద్ధికి అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని, ఉత్పత్తి పెంపు, ఖర్చుల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎండీ సూచించారు. కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, విద్య, నివాస సదుపాయాల మెరుగుదలకు సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు, జిఎం ఎన్విరాన్‌మెంట్ బి. సైదులు, కార్మిక సంఘ నాయకులు మరియు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.