Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
15-03-2026

పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసగిరి కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భక్తి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయానికి విచ్చేసిన మంత్రివర్యులను ఆలయ అర్చకులు, నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం మంత్రులు ఇద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు.

కళ్యాణ మహోత్సవాన్ని భక్తులతో కలిసి వీక్షించిన మంత్రులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసగిరి గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీశాఖ సహకారంతో ఈ ప్రాంతాన్ని ఈకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి భావం, ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.