Reading Time: < 1 minute

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి వంటి కారణాలే దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.

వైద్యుల ప్రకారం, అధిక రక్తపోటు ఒక నిశ్శబ్ద వ్యాధి. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే దీన్ని అదుపులో పెట్టుకోకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాపాయకర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఎందుకు వస్తుంది?

వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఫాస్ట్ ఫుడ్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం మానసిక ఒత్తిడి, టెన్షన్ఎ క్కువసేపు కూర్చుని పని చేయడం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి కారణాలు అధిక రక్తపోటుకు ప్రధానంగా దారితీస్తున్నాయి.

అధిక రక్తపోటు లక్షణాలు

అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు… తరచుగా తలనొప్పి, తల భారంగా అనిపించడం, తల తిరగడం, అనవసర భయం లేదా ఆందోళన, అప్పుడప్పుడు చూపు మసకబారడం, అలసట, విశ్రాంతి లేకపోవడం.

ఎలా నియంత్రించాలి?

అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.

రోజుకు 5 గ్రాములకంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ప్రతిరోజూ నడక లేదా వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరిపడా నిద్ర తీసుకోవాలి, బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

ప్రారంభ దశలోనే రక్తపోటును గుర్తించి నియంత్రించుకుంటే, భవిష్యత్తులో వచ్చే తీవ్ర ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.