Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
14-03-2026

భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) సంస్థల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.

శనివారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీసీ, నావా లిమిటెడ్, కేటీపీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సింగరేణి, టీజీ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు గతంలో అందించిన సహకారం మరియు ఈ సంవత్సరం అందించనున్న సహాయంపై వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. భక్తులకు తాగునీరు, అన్నదానం, వసతి, పారిశుధ్యం వంటి సౌకర్యాలు మెరుగ్గా కల్పించేందుకు సి ఎస్ ఆర్ సంస్థలు తమవంతు సహకారం అందించాలని కోరారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓతో సంప్రదించి అవసరమైన ఏర్పాట్ల వివరాలను సేకరించాలని ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీఓ) సంజీవరావును కలెక్టర్ ఆదేశించారు. ఆ అవసరాల మేరకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారాన్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.