Reading Time: < 1 minute

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచే పిల్లలకు పాలు తాగడం అలవాటు చేయడం వెనుక శరీర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతాయన్న నమ్మకం ఉంది. పాలల్లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండటంతో రోజువారీ ఆహారంలో పాలను కీలక భాగంగా పరిగణిస్తారు.

అయితే మారుతున్న జీవనశైలి, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో పాలు అందరికీ ఒకే విధంగా మేలు చేయవు అనే విషయం తాజాగా వెలుగులోకి వస్తోంది. ఇటీవలి కాలంలో పాలు తాగిన తర్వాత కొందరికి జీర్ణ సమస్యలు, మరికొందరికి ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో పాలు అందరికీ సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పాలు అందరికీ ఎందుకు మంచిది కాదు?

ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ వైద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి మాట్లాడుతూ.. పాలు అందరికీ ఒకే రీతిలో ప్రయోజనం చేకూర్చవని తెలిపారు. దీనికి ప్రధాన కారణం లాక్టోస్ అసహనం (Lactose Intolerance) అని వివరించారు. ఈ సమస్య ఉన్నవారిలో లాక్టేజ్ ఎంజైమ్ తక్కువగా ఉండటంతో పాలను జీర్ణం చేయడం కష్టమవుతుంది. ఫలితంగా గ్యాస్, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.

అలాగే కొంతమందికి పాల అలెర్జీ, కఫం లేదా శ్లేష్మం సమస్యలు ఉండవచ్చని, దీని వల్ల జలుబు లేదా శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి కూడా పాలు అనుకూలం కావని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో పాలు తాగడం వల్ల చర్మ సమస్యలు, ముఖ్యంగా మొటిమలు, జిడ్డు చర్మ సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయాలు ఏమిటి?

పాలు తాగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న వారు పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను తీసుకోవచ్చని, ఇవి సులభంగా జీర్ణమవుతాయని సూచిస్తున్నారు. అలాగే లాక్టోస్ లేని పాలు కూడా మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని తెలిపారు.

పాలు తీసుకున్న తర్వాత కడుపు, చర్మం లేదా శ్వాస సంబంధిత సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.