Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
07-03-2026

దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కింద కొత్తగూడెంలో సహాయ ఉపకరణాలు, వివాహ ప్రోత్సాహకాలు మరియు ఎకనామిక్ రిహాబిలిటేషన్ సబ్సిడీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దివ్యాంగులకు అందిస్తున్న సహాయ ఉపకరణాలు వారి దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. లబ్ధిదారులు వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన వారికి రెట్రో ఫిట్టెడ్ మోటార్ వెహికల్స్ (స్కూటీలు) సి.ఎస్.ఆర్. ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 60 మంది లబ్ధిదారులకు సహాయం అందించారు. ఇందులో రెట్రో ఫిట్టెడ్ మోటార్ వెహికల్స్ 25, బ్యాటరీ ట్రైసైకిళ్లు 7, బ్యాటరీ వీల్‌చైర్లు 7, దివ్యాంగుల ఎకనామిక్ రిహాబిలిటేషన్ సబ్సిడీలు 8 మందికి, వివాహ ప్రోత్సాహకాలు 8 మందికి, ట్రాన్స్‌జెండర్ పునరావాస సబ్సిడీలు 5 మందికి పంపిణీ చేశారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూద్ గణేష్, కార్పొరేటర్ ఎన్. శ్యామల, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుండపునేని సతీష్, సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.